3-7 ఏడాది వయసు గల పిల్లలకి స్నాక్ ఐడియాస్

సాధరణంగా మూడు నుండి ఏడు సంవత్సరాల పిల్లలు స్కూలుకి వెళుతుంటారు. వారు తమ తోటి వారిని చూసి ఆహారం విషయంలో మారాం చేయడం మొదలు పెట్టవచ్చు. అందుకే వారు ఇష్టంగా తింటూ, వారి పోషణ విషయంలో రాజీ పడవలసిన అవసరం లేని కొన్ని సులువైన ఆహారాలు వాటి తయారీ విధానాలు:
కొబ్బరి అన్నం:
[దీని వల్ల మంచి శక్తి వస్తుంది. గుండెకి సంబంధిత అనారోగ్యాలు రాకుండా సహాయపడుతుంది]
కావలసిన పదార్థాలు - ఒక కప్పుడు అన్నం, ఒక చెంచాడు శెనగలు, ఒక కప్పుడు కొబ్బరి తురుము, పావు చెంచాడు ఆవాలు, పావు చెంచాడు మినప్పప్పు, కరివేపాకు, ఉప్పు తగినంత, ఒక పండు మిరపకాయ.
తయారీ విధానం - శెనగలని ఒక పావు గంట సేపు నీళ్ళలో నానబెట్టాలి. ఒకవేళ అన్నం వేడిగా ఉంటే అది చల్లార్చుకోవాలి. ఒక బాండీలో నూనె వేడి చేసి దానిలో ఆవాలు, మినప్పప్పు వేసి అవి చిటపటలాడే దాకా వేయించి కరివేపాకు, పండు మిరపకాయ వేయాలి. శెనగలలో నీరు వడగట్టి బాండీలో వేసి అవి చిటపటలాడి గోధుమ రంగులోకి వచ్చే దాకా వేయించాలి. కొబ్బరి తురుము దీనిలో వేసి కొబ్బరి పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఇప్పుడు బాండీలోకి అన్నం వేసి అది ముద్దలు ముద్దలుగా లేకుండా చూసుకోవాలి. అన్నం బాగా వేడి ఎక్కే దాకా మొత్తం బాగా కలుపుకోవాలి.
పావు భాజీ:
కావలసిన పదార్థాలు - నాలుగైదు బంగాళదుంపలు, రెండు క్యారెట్లు, ఒక సొరకాయ, పది బీన్సు, ఒక క్యాప్సికం,మూడు నాలుగు చిన్న వంకాయ, ఒక చిన్న బీటురూటు ముక్క, మూడు తరిగిన ఉల్లిపాయలు, మూడు తరిగిన టమాటాలు, ఒక చెంచాడు తరిగిన అల్లం, ఒక చెంచాడు గరం మసాలా, అర కప్పుడు బఠాణీలు, రెండు చెంచాల పావు భాజీ మసాలా, కారం, రెండు చెంచాల వెన్న, ఒక చెంచాడు నిమ్మరసం, ఉప్పు తగినంత.
తయారీ విధానం - అన్ని కూరగాయలు శుభ్రంగా కడిగి తోలు తీసి సన్నగా తరగాలి. ఈ ముక్కలని ఒక గ్లాసుడు నీళ్ళు, ఉప్పు కలిపి కుక్కర్లో వేసి నాలుగు విజిల్సు వచ్చే దాకా ఉడకనివ్వాలి. ప్రెజరు పోయిన తరువాత ఈ ముక్కలని చల్లార్చుకుని మిక్సీ వేసుకుని ఒక మెత్తని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఒక బాండీలో వెన్న కరిగించి అల్లం వేయించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు కలిపి అవి ముదురు గోధుమ రంగు వచ్చే దాకా వేయించాలి. టమాటా ముక్కలు వేసి నూనె ఇంకి పోయేదాకా వేయించాలి. ఉడకబెట్టిన బఠాణీలని మెదిపి బాండీలో వేసి మసాలా పొడులు కూడా వేసి కలపాలి. ముందుగా మిక్సీ వేసిన కూరగాయల మిశ్రమాన్ని బాండీలో వేసి బాగా కలపి చిన్న మంట మీద ఒక పావు గంట ఇరవై నిమిషాల వండాలి. ఇలా వండిన భాజీ మీద నిమ్మరసం పిండి బ్రెడ్డుతో పాటూ అందిస్తే పావు భాజీ సిద్ధం.
రాగి క్యారెట్టు దొశ:
కావలసిన పదార్థాలు - ఒక కప్పుడు రాగి పిండి, అర కప్పుడు గోధుమ పిండి, అర కప్పుడు క్యారెట్టు తురుము, ఒక చెంచాడు జీలకర్ర, ఉప్పు తగినంత, నీరు లేదా మజ్జిగ, కొత్తిమీర, కరివేపాకు, తురిమిన లేదా తరిగిన కూరగాయలు, ఉల్లిపాయలు.
తయారీ విధానం - పొడి పదార్థాలు అన్నీ ఒక పెద్ద గిన్నెలో కలుపుకోవాలి. ఆ తరువాత తడి పదార్థాలు ( నీరు లేదా మజ్జిగ ) ఆ పొడి పదార్థాలతో కలిపి చక్కని మిశ్రమాన్ని చేసుకోవాలి. ఆ దోశల పిండిలో కొంచెం నూనె లేదా నెయ్యి చిలకరించాలి. మామూలు దోశలు వేసే విధంగానే దోశలు గోధుమ రంగు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ దోశలతో పాటూ మీకు నచ్చిన చట్నీ ఏదైనా పెట్టి వడ్డించండి.
పనీర్ టిక్కా:
కావలసిన పదార్థాలు - రెండు వందల గ్రాముల పనీర్ చదరాలుగా కోసినది, ఒక కప్పుడు పెరుగు, రెండు చెంచాల పాల మీగడ, ఉప్పు తగినంత, ఒక చెంచాడు కొత్తిమీర పొడి, అర చెంచాడు పసుపు, అర చెంచాడు ఛాట్ మసాలా, అర చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు శనగ పిండి, ఒక చెంచాడు అల్లం-వెల్లుల్లి మిశ్రమం, ఒక కప్పుడు క్యాప్సికం ( ఎరుపు, పసుపు, పచ్చని రంగులవి )చదరాలుగా కోసినది, ఒక టమాటా చదరాలుగా కోసినది, ఒక ఉల్లిపాయ చదరాలుగా కోసినది.
తయారీ విధానం - ఒక గిన్నెలో పెరుగు, పాల మీగడ, శనగ పిండి కలిపి ఈ మిశ్రమానిలో అన్ని మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. దీనికి పనీర్, క్యాప్సికంలు, టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు వరకు పక్కన ఉంచాలి. ఆ తరువాత ఒక బాండీ వేడి చేసి నూనె పోసుకోవాలి. నూనె సరిపడా వెచ్చబడిన తరువాత పన్నీరు, కూరగాయల మిశ్రమాన్ని మరీ పెద్దది మరీ చిన్నది కాని మంట మీద వేయించాలి. అన్ని పక్కలా బాగా వేగే దాకా ( గోధుమ రంగు వచ్చే దాకా ) వేయించి వెచ్చగా ఉండగా వడ్డించాలి.
ఇలా రకరకాల ప్రాంతాల వంటకాలు వండి అందిస్తే, పిల్లలకి కూడా కొత్తగా, మీరు ఈరోజు ఎం చేసారా అని, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలవెంట పరిగెత్తి చందమామ రావే అని పిలవాల్సిన అవసరం పోయినట్టే.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...