తెలంగాణలో బోనాల పండుగ షురూ: బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?

ఆషాఢ మాసం వచ్చేసింది ! తెలంగాణా రాష్ట్ర పర్వదినం అయిన బోనాల పండుగను తెచ్చేసింది !! ప్రతి ఏడాది లాగే ఉత్సవాలకు స్వాగతం భాగ్యనగరం ముస్తాబైంది. నేడు గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. నగరమంతటా పండుగ సంరంభం మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్లో ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూళ్పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నగర వాసులు నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకు౦టారు. నగరాల్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో
అసలు బోనాల పండుగ ఎప్పుడు మొదలైంది? దాని చరిత్ర ఏంటి? విశిష్ఠత ఏంటో ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం..
తెలంగాణా హిందూ కుటుంబ బాంధ్యవాలతో పెనవేసుకుపోయిన పండుగ బోనం. ఇది మహిళా శక్తికి ప్రతిరూపం. సంప్రదాయానికి ప్రతిబింబం. అందుకే ఈ బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ.. ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు. తమ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆపద రాకుండా రక్షించమని ప్రార్థిస్తారు. తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కర్ణాటకల్లోనూ బోనాలు కనిపిస్తుంటాయి.
బోనం అంటే ఏంటి?
భోజనం అనే పదం ప్రకృతి.. దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగికుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని, డప్పు మొదలైన వాయిద్యాలతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ బోనాల కుండలను నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు. పల్లెటూర్లలో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తారు.
ఈ జాతరలో ఏం చేస్తారు?
బోనాల పండుగ కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ జీవితానికి సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో ప్రతిబింబిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారమూ ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం చేయడమూ మనం చూడవచ్చు. మొత్తం మీద జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి?
చరిత్రకు ముందు నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉందని చెప్పవచ్చు. అడవుల్లో, కొండల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన ఆకు, పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను ఆ అమ్మకు సమర్పించాడు. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణమే బోనాలుగా మారింది. పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. ఆరు వందల ఏళ్ల నాటి పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు, 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మగుడిని కట్టించి, ఆ దేవతకు బోనాలు సమర్పించినట్టు చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే.. 1869లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వచ్చి ప్రబలడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు.. గ్రామ దేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాలు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హాసన్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెబుతారు.
బోనాలు వెనక శాస్త్రీయత..
రుతుపవనాలు ప్రవేశించి వర్షా కాలం మొదలవ్వగానే మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉంది. బోనంలో వాడే వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇళ్ళకు వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా.. బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా ఆంటీబయాటిక్ ప్రయోజనాల కోసమే అని అర్ధం చేసుకోవచ్చు.
మీ కామెంట్లు మా తరువాతి బ్లాగ్లకు మేరుగుచేస్తాయి. నచ్చితే కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి..
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...